బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్లో రాజకీయ ఆశ్రయం కల్పింఛినప్పటి నుంచి ఆ దేశం భారత్పై రగిలిపోతోంది. ఆ కోపంతోనే భారత్ వేదికలలో జరుగబోయే టీ-20 ప్రపంచ కప్-2026 పోటీలలో పాల్గొనేందుకు నిరాకరించింది.
భద్రతా కారణాల వల్ల తమ టీమ్ను భారత్కు పంపించలేమని, కనుక భారత్-బాంగ్లా మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలని కోరింది. కానీ అందుకు ఐసీసీ నిరాకరించింది. ఈ పోటీలలో బంగ్లాదేశ్ పాల్గొనబోవడం లేదు కనుక దాని స్థానంలో స్కాట్లాండ్ టీమ్కి అవకాశం కల్పించింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఆ దేశ క్రికెట్ బోర్డు కట్టుబడి ఉండక తప్పదు. కానీ దాని వలన అదే తీవ్రంగా నష్టపోతుంది. ఈ మ్యాచ్ల వాణిజ్య ప్రకటనలు, స్పాన్సర్ షిప్ వగైరాల ద్వారా బంగ్లా బోర్డుకి సుమారు రూ.240 కోట్లు ఆదాయం వస్తుంది. దానిలో అధిక భాగం కోల్పోతుంది. ఈ ప్రభావం ఇక్కడితో ఆగదు.
ఈ ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ మద్య భారత్-బాంగ్లా సిరీస్ కూడా రద్దవుతుంది. ప్రభుత్వ నిర్వహణకే తగిన ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం బోర్డుకి సాయపడలేదు. కనుక ఇలాంటి కీలకమైన మ్యాచ్లు వదులుకోవడం వలన బంగ్లా క్రికెట్ బోర్డు రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్ధిక సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది.