అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఫ్లోరిడా రాష్ట్రంలో బ్రెవార్డ్ కౌంటీలో ఐ-95 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. మంగళవారం ఉదయం సుమారు 10 గంటలకు పామ్ బే ప్రాంతంలోని 172వ మైలురాయి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టుని గుద్దుకుంది. వెంటనే మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులలో ఒకరు నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలం నారాయణపూర్ (నాడాపూర్)కు చెందిన రాహుల్ అనే యువకుడుగా పోలీసులు గుర్తించారు.
మిగిలిన ఇద్దరూ కూడా తెలంగాణ నుంచి వచ్చి అతనితో కలిసి చదువుకుంటున్న విద్యార్ధులే అని గుర్తించారు. కానీ వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అమెరికాలో ఉన్నత విద్యలభ్యసించేందుకు మూడు నెలల క్రితమే రాహుల్ అమెరికా వెళ్ళాడని, కానీ ఇంతలోనే మృత్యువు కబళిస్తుందని అనుకోలేదని అతని తల్లితండ్రులు హరిబాబు, నాగమణి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.