సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో జాతీయ రహదారి-65పై వెళ్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి ముందు డివైడర్ను ఢీ కొట్టింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్ బస్సు దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పరుగున వచ్చి బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడినవారిని పోలీసులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాద కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు క్రేన్ తెప్పించి రెండు వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.