ఎవరినైనా బలవంతంగా ఎత్తుకుపోతే కిడ్నాప్ చేయడం అంటారు. అమెరికా ఆర్మీ ఇదే చేసింది. వెనిజులా రాజధాని కాకరస్పై శనివారం తెల్లవారుజామున అమెరికా యుద్ధవిమానాలు దాడులు చేస్తుండగా, అమెరికన్ కమాండోలు అధ్యక్ష భవనంలోకి ప్రవేశించి అధ్యక్షుడు నికోలస్ మదురో, అయన సతీమణిని బందీలుగా పట్టుకుపోయారు.
నికోలస్ మదురో చేతికి బేడీలు వేసి, కళ్ళకు గంతలు కట్టి తమ యుద్ధనౌకలో అమెరికాకు తరలించారు. అమెరికా విడుదల చేసిన ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందే చెప్పుకున్నట్లు వారిద్దరినీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కిడ్నాప్ చేయించారని చెప్పుకోవచ్చు.
వెనిజులా అధ్యక్షుడు మాదక ద్రవ్యాల ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నారని, ఆయన అండదండలతోనే అమెరికాకు మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. అయితే వెనిజులాలో ఉన్న అపారమైన చమురు నిక్షేపాలపై డోనాల్డ్ ట్రంప్ కన్నేసి ఈవంకతో దురాక్రమణకు పాల్పడాలని కుట్ర చేస్తున్నారని నికోలస్ మదురో రెండు రోజుల క్రితమే ఆరోపించారు.
నికోలస్ మదురోని బందించి అమెరికా తీసుకువచ్చిన తర్వాత ఫ్లోరిడాలో ట్రంప్ మాట్లాడుతూ, “వెనిజులాలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ముఖ్యంగా చమురు ఉత్పత్తి, సరఫరా, అమ్మకాల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కనుక వెనిజులా పరిస్థితి చక్కబడే వరకు ఆ దేశం మా నియంత్రణలోనే ఉంటుంది.
అమెరికన్ చమురు కంపెనీలను వెనిజులాకి పంపించి అక్కడి చమురు వ్యవహారాలను సరిదిద్దిస్తాను. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయలనుకునే వారికి, అమెరికన్ ప్రజల జీవితాలతో ఆడుకోవాలనుకునేవారికి ఇదో గట్టి హెచ్చరిక వంటిదే. అవసరమైతే వెనిజులా మళ్ళీ మరింత భీకర దాడులు చేయడానికి వెనకాడము,” అని ట్రంప్ అన్నారు.