నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాలకల్ గ్రామంలో దారుణం జరిగింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. మొదటిసారి హత్యాయత్నం విఫలమవడంతో రెండో సారి భర్తని సిరంజ్ ద్వారా టాయిలెట్ క్లీనర్ను నరాల్లోకి ఎక్కించి హత్య చేసింది. .
పోలీసుల కథనం ప్రకారం, ఆమె భర్త ప్రశాంత్ కొన్నేళ్ళుగా గల్ఫ్ దేశంలో పనిచేస్తున్నాడు. అప్పుడే అతని భార్య సంధ్యకు బంటి అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ప్రశాంత్ తిరిగివచ్చినప్పుడు వారి వ్యవహారం గురించి తెలుసుకొని భార్యతో తరచూ గొడవపడుతున్నాడు.
దీంతో వారు అతని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. గత నెల 30న సంధ్య భర్తకి మద్యం తాగించి ప్రియుడి సాయంతో ఇంటిపై నుంచి కిందకు తోసివేసింది. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ మద్యం మత్తులో పై నుంచి దూకేశాడని అందరినీ నమ్మించి ఆమె స్వయంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది. తద్వారా ఎవరికీ తనపై అనుమానం రాకుండా జాగ్రత్త పడింది.
కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్తని అక్కడే హత్య చేయాలని సంధ్య, ఆమె ప్రియుడు నిర్ణయించుకున్నారు. ప్రశాంత్ వద్ద ఎవరూ లేని సమయంలో వారిద్దరూ సిరంజ్ సహాయంతో టాయిలెట్ క్లీనర్ను అతని నరాల్లోకి ఎక్కించడంతో చనిపోయాడు. అయితే వైద్యులకు అనుమానం కలిగి పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని ప్రశాంత్ శవానికి పోస్టుమార్టం చేయించారు. ఆ నివేదికలో అసలు విషయం బయటపడింది. విచారణలో సంధ్య నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు ఆమెతో పాటు ప్రియుడు బంటిని అదుపులోకి తీసుకున్నారు. హత్యానేరం కింద వారిరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.