తెలంగాణలో ఓటర్ల సమగ్ర పరిశీలన (సర్) ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 24లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం గడువు విధించింది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 7 శాతం మంది చేత మాత్రమే బీఎల్వోలు దరఖాస్తులు నింపించారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కనుక బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ‘సర్’ ప్రక్రియ గడువు పొడిగించాలని వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలో చాలా మందికి పొరుగు రాష్ట్రంలో కూడా ఓటు హక్కు ఉందని, అటువంటివారిని గుర్తించి వారి ఓట్లు తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
ఓటర్ల వివరాలు నమోదు చేసే బీఎల్వోలు వారి సమాచారం సేకరించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ లెక్కన జూలై 24లోగా రాష్ట్రంలో అందరు ఓటర్ల సమాచారం సేకరించి నమోదు చేయడం చాలా కష్టమని, కనుక గడువు పొడిగించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు సుదర్శన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.