భారత్-పాక్తో సహా ఆరేడు యుద్ధాలు ఆపించేశానని గొప్పగా చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, శనివారం తెల్లవారుజామున తన యుద్ధ విమానాలని వెనిజులా రాజధాని కరకాస్పైకి పంపించి భీకర దాడులు చేయించారు. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అమెరికన్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది.
తమ యుద్ధ విమానాలు కేవలం వెనిజులా సైనిక స్థావరాలపైనే దాడులు చేశాయని పౌర నివాసాలపై దాడులు చేయలేదని అమెరికా ప్రకటించింది.
అయితే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురో అమెరికా చర్యని తీవ్రంగా ఖండించారు. అమెరికా దాడిలో అనేక మంది అమాయక పౌరులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడుల నేపధ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు.
తమ దేశంలో చమురు, ఖనిజ నిక్షేపాల కోసమే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంత బరితెగించారని ఆరోపించారు.
అయితే ట్రంప్ మరోలా చెపుతున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కనుసన్నలలోనే ఆ దేశంలో మాదకద్రవ్యాల ముఠాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆ ముఠాలు వెనిజులా నుంచి అమెరికాకు భారీగా మాదకద్రవ్యాలు సంగ్లింగ్ చేసి తీసుకువస్తున్నాయని ఆరోపించారు. వాటి వలన అమెరికన్ సమాజం విచ్చినం అయ్యే ప్రమాదం ఉందని, అందుకే వెనిజులాలోని మాదకద్రవ్యాల ముఠాలను అంతం చేయడానికి సిద్ధమయ్యామని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.