మొన్న ఆదివారం ఆస్ట్రేలియాలో సిడ్నీలోని బొందీ బీచ్లో హనుక్కా ఉత్సవం జరుపుకుంటున్న యూదులపై ఇద్దరు వ్యక్తులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. పలువురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
అప్పుడు సిడ్నీ పోలీసులు ఆ ఇద్దరు దుండగులపై కాల్పులు జరుపగా వారిలో సాజిద్ అక్రమ్ (50) చనిపోయారు. అతనితో వచ్చిన వ్యక్తి అతని కుమారుడు నవీద్ అక్రమ్ (27)ని బందించగలిగారు. విచారణలో సాజిద్ అక్రమ్ హైదరాబాద్కు చెందినవారిగా సిడ్నీ పోలీసులు గుర్తించారు.
సిడ్నీలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాది హైదరాబాద్కి చెందిన వ్యక్తి అని స్పష్టం అవడంతో డీజీపీ శివధర్ రెడ్డి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
దాని ప్రకారం, సాజిద్ అక్రమ్ హైదరాబాద్లోనే బీకాం వరకు చదువుకొని ఉన్నత చదువుల కోసం 1988లో విద్యార్ధి వీసాపై ఆస్ట్రేలియా వెళ్ళాడు. తర్వాత అక్కడే యూరోపియన్ యువతి వెనెరా గ్రోసోను పెళ్ళి చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు.
అప్పటి నుంచి ఇన్నేళ్ళలో ఆరుసార్లు హైదరాబాద్ వచ్చి వెళ్ళాడు. కేవలం ఆస్తిపాస్తుల వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చి వెళ్ళేవాడు. అతనికి హైదరాబాద్లో ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తెలియదని సాజిద్ అక్రమ్ కుటుంబ సభ్యులు తెలిపారు,” అని ఆ ప్రకటనలో పేర్కొంది.