ఇరాన్‌ అణు స్థావరాలపై అమెరికా బాంబు దాడులు

June 22, 2025
img

పాక్‌పై భారత్‌ దాడులు చేసినప్పుడు శాంతి ప్రవచనాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఇరాన్‌ మీదకి తమ అత్యాధునిక బీ-2 స్పిరిట్ స్టెల్త్ యుద్ధవిమానాలను పంపించి ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫాహన్‌ వద్ద గల అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేశారు. 

ఇరాన్‌ జోలికి వస్తే అమెరికాపై అణుబాంబులతో దాడి చేస్తామని ఇరాన్‌ సుప్రీం కమాండర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించడం, అణు ఒప్పందంపై సంతకాలు పెట్టడానికి ఇరాన్‌ నిరాకరించినందుకు అమెరికా ఈ దాడులు చేసింది. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ ఇరాన్‌ని లొంగదీసుకోలేకపోతోందని డోనాల్డ్ ట్రంప్‌ భావించడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.   

వారం రోజులలోగా ఖమేనీ లొంగిపోవాలని లేకుంటే దాడులు చేస్తామని హెచ్చరించిన ట్రంప్‌ రెండు రోజులలోనే ఇరాన్‌ మీదకి తమ యుద్ధ విమానాలని పంపించి దాడులు చేయించారు. 

దాడుల అనంతరం డోనాల్డ్ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ,  ‘ఇరాన్‌ గగనతలంలో నుంచే అమెరికా యుద్ధ విమానాలు ఈ దాడులు చేసి అణు కేంద్రాలను ధ్వంసం చేసి సురక్షితంగా తిరిగివచ్చాయి. ప్రపంచంలో మరే దేశ మిలటరీకి ఇది సాధ్యం కాదు. ఈ దాడులలో ఇజ్రాయెల్‌ మాకు పూర్తిగా సహకరించింది. 

ఇప్పటికైనా ఇరాన్‌ అణు ఒప్పందంపై సంతకాలు చేయాలని లేకుంటే మరింత భీకర దాడులు చేస్తామని డోనాల్డ్ ట్రంప్‌ హెచ్చరించారు. 

ఇరాన్‌పై అమెరికా దాడి జరిపితే, ఇరాన్‌కు మద్దతుగా రష్యా, చైనాలు రంగంలో దిగితే మూడో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.    

Related Post