లండన్‌లో తెలంగాణవాసి మృతి

April 13, 2020
img

తెలంగాణకు చెందిన కాయిత సతీష్ (26) ఆదివారం తెల్లవారుజామున లండన్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. వరంగల్‌ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని రాంనగర్‌లో నిరుపేద వ్యవసాయకుటుంబానికి చెందిన సతీష్ గత ఏడాది జనవరిలో ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్ళాడు. శనివారం రాత్రే తన తల్లితండ్రులు శారద, కుమారస్వామిలతో ఫోన్‌లో మాట్లాడాడు. కరోనా నేపధ్యంలో జాగ్రత్తగా ఉండాలని తల్లితండ్రులు జాగ్రత్తలు చెప్పారు. 

ఆదివారం తెల్లవారుజామున నిద్రలో ఉండగా సతీష్ కు గుండెపోటు వచ్చి మంచం మీద నుంచి కిందపడిపోయాడు. పక్క రూములో ఉన్న అతని స్నేహితులు ఆ శబ్ధం విని అతని రూములోనికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. కానీ లోపల నుంచి గొళ్ళెం పెట్టి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా సతీష్ చనిపోయున్నాడు. అతను గుండెపోటుతో చనిపోయినట్లు రాయల్ ప్రిస్టిన్ ఆసుపత్రి వైద్యులు దృవీకరించారు. 

కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి అతని తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సతీష్ అన్నయ్య రంజిత్ అమెరికాలో, తమ్ముడు దేవేందర్ లండన్‌లోనే వేరే ప్రాంతంలో ఉన్నతవిద్యలభ్యసిస్తున్నారు. 

అయితే లాక్‌డౌన్‌ కారణంగా సతీష్ మృతదేహం ఇప్పట్లో స్వదేశానికి తీసుకువచ్చే అవకాశం లేకపోవడంతో రాంనగర్‌లో ఉన్న సతీష్ తల్లితండ్రులు, ప్రస్తుతం లండన్‌లోనే ఉన్న సతీష్ తమ్ముడు దేవేందర్, అమెరికాలో చిక్కుకుపోయిన అన్న రంజిత్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 

Related Post