ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న కల్కి ఎడి2898 సినిమాలో పలువురు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సీనియర్ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో రాజేంద్ర ప్రసాద్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి, శాశ్వత చటర్జీ తదితరులున్నారు. ఈ సినిమాలో ప్రభాస్కు హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీలు దీపికా పడుకొనే, దిశా పటానీ నటిస్తున్నారు.
కల్కి ఎడి2898ని వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తుండటంతో చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్, టీజర్, నటీనటుల పోస్టర్స్ అన్నీ కూడా ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచడంతో ప్రభాస్ అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేస్తున్న అమితాబ్ బచ్చన్ని ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు పరిచయం చేయబోతున్నట్లు కల్కి ఎడి2898 టీం ప్రకటించింది.
కొన్ని రోజుల క్రితమే కల్కి ఎడి2898 టీం ఇటలీలోని సర్ధినియా ద్వీపంలో ప్రభాస్, దిశా పటానీలపై ఓ పాటని చిత్రీకరించి తిరిగి వచ్చింది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్డ్జీ స్టోజిల్జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. కల్కి ఏడి 2898 మే 9వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ దేశంలో ఎన్నికల హడావుడి నెలకొని ఉన్నందున అవి ముగిసిన తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.