ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో గత ఏడాది డిసెంబర్లో వచ్చిన సలార్ రూ.700 కోట్ల కలెక్షన్లతో రికార్డులు బద్దలు కొట్టి నిర్మాతలకు కనకవర్షం, ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్కు గొప్ప క్రేజ్ సృష్టించింది. దానికి సీక్వెల్గా రాబోతున్న ‘సలార్ శౌర్యాంగపర్వం’ ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఆ పనులలో చాలా బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ హటాత్తుగా హైదరాబాద్ వచ్చి విజయ్ దేవరకొండని కలవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి.
‘సలార్ శౌర్యాంగపర్వం’లో విజయ్ దేవరకొండని కూడా తీసుకునేందుకే ప్రశాంత్ నీల్ పనికట్టుకొని హైదరాబాద్ వచ్చి కలిశాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ సలార్ వంటి గంభీరమైన యాక్షన్ సినిమాలో ప్రశాంత్ నీల్ కొత్తగా మరెవరినీ చేర్చుకోరని, ఆయన విజయ్ దేవరకొండతో వేరేగా ఓ సినిమా చేయాలనుకొంటున్నారని, ఆ కధ వినిపించేందుకే హైదరాబాద్ వచ్చి కలిశారని మరికొందరు వాదిస్తున్నారు. కనుక ప్రశాంత్ నీల్ హైదరాబాద్ వచ్చి విజయ్ దేవరకొండని ఎందుకు కలిశారు? అనే ప్రశ్నకు వారు సమాధానం చెప్పనంతవరకు ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి.