ప్రభాస్- నాగ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న కల్కి ఎడి2898 సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వథామగా నటిస్తున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ వైజయంతీ మూవీస్ విడుదల చేసిన వీడియో ఆ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ద్వాపరయుగంలో మహాభారతం కాలం నాటి అశ్వథామయే నేటికీ సజీవంగా గుహలో జీవిస్తున్నట్లు ఈ వీడియోలో చూపడం, ఆ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో చెప్పడం చాలా అద్భుతంగా ఉంది. కనుక ఆనాటి అశ్వథామకు 2898 సంవత్సరంలో జరుగుతున్న ఈ కల్కి కధతో ఏమిటి సంబంధం?అనేది సినిమాపై ఆసక్తిని ఇంకా పెంచుతోంది.
కల్కి ఎడి 2898లో రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, పశుపతి, శాశ్వత చటర్జీ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ప్రభాస్కు జోడీగా ఇద్దరు బాలీవుడ్ బ్యూటీలు దీపికా పడుకొనే, దిశా పటానీ నటిస్తున్నారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్డ్జీ స్టోజిల్జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.
కల్కి ఏడి 2898 మే 9వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ దేశంలో ఎన్నికల హడావుడి నెలకొని ఉన్నందున అవి ముగిసిన తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.