నేటితో 4వ దశ లోక్సభ ఎన్నికలకు నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. మే 13న పోలింగ్ జరుగబోతున్నందున మే 11 వరకే ఎన్నికల ప్రచారానికి గడువు మిగిలింది. అంటే మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉందన్న మాట.
ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం సిద్ధిపేటలో ఎన్నికల సభలో పాల్గొని మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
“తెలంగాణ రాష్ట్రం ఢిల్లీకి (కాంగ్రెస్ అధిష్టానానికి) ఏటిఎంలా మారిపోయింది. తెలంగాణ ప్రజల సొమ్ముని ఇక్కడి కాంగ్రెస్ నేతలు మూట కట్టి తమ అధిష్టానానికి పంపిస్తున్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ అవినీతి పాలనను చూశాము. ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి పాలనను చూస్తున్నాము. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు పార్టీలు అవినీతిలో మునిగి తేలుతున్నాయి. అందుకే బిఆర్ఎస్ హయాంలో జరిగిన ఏ ఒక్క అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు.
తెలంగాణలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపిస్తే లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అవినీతిని తుడిచిపెట్టేస్తాము. లోక్సభ ఎన్నికలలో ఈసారి బీజేపీ 405కి పైగా సీట్లు తప్పక గెలుచుకుంటుంది. మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు. దేశానికి మోడీ నాయకత్వం చాలా అవసరం ఎందుకంటే కశ్మీర్, అయోధ్యతో సహా పలు క్లిష్టమైన సమస్యలు పరిష్కరించి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మెదక్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు మీ అందరికీ చిరపరిచితుడు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అమిత్ షా అన్నారు.