తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శనివారం సంగారెడ్డిలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధికి ఏమీ చేయలేదని, కేవలం వారసత్వ రాజకీయాలే చేసిందని విమర్శించారు. కానీ బీజేపీ మాత్రం దేశంలో 140 కోట్ల మంది ప్రజలనే కుటుంబ సభ్యులుగా భావిస్తూ, వారి సంక్షేమం, దేశాభివృద్ధి కోసం పనిచేస్తోందన్నారు.
ఈ పదేళ్ళలో ప్రధాని నరేంద్రమోడీ భారత్ను, దేశ ఆర్ధిక వ్యవస్థను తిరుగులేని శక్తిగా మార్చారని తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. భారత్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నందుకు దేశ ప్రజలు మళ్ళీ మరోసారి మోడీని గెలిపించుకొని ప్రధానిగా చేయబోతున్నారని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోనే బీజేపీకి పోటీ ఉంటుంది తప్ప బిఆర్ఎస్ పార్టీతో కాదని తమిళిసై సౌందర్ రాజన్ స్పష్టం చేశారు. తనకు గవర్నర్ పదవి కంటే ప్రజల మద్య ఉండటమే ఇష్టమని అందుకే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చానని తమిళిసై సౌందర్ రాజన్ చెప్పారు.