శనివారం సాయంత్రం 4 గంటల నుంచి సచివాలయంలో జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం రద్దు అయ్యింది. కేంద్ర ఎన్నికల కమీషన్ మంత్రివర్గ సమావేశానికి అనుమతి నిరాకరించింది. ఈ నెల 27వ తేదీన వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగబోతోంది.
కనుక మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఆ ఉప ఎన్నికని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అనుమతి నిరాకరిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ సిఎస్ శాంతికుమారికి లేఖ ద్వారా తెలియజేసింది. దీంతో చివరి నిమిషంలో మంత్రివర్గ సమావేశం రద్దు అయ్యింది.
జూన్ 4వ తేదీన లోక్సభ ఎన్నికల ఫలితాలు, జూన్ 5వ తేదీన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. కనుక అంత వరకు మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం లేన్నట్లే.
మంత్రివర్గ సమావేశం రద్దు కావడంతో ఆగస్ట్ 15లోగా రైతులకు రూ.2 లక్షల పంట రుణాల మాఫీపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతుంది కనుక ఆ హామీ అమలు కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉండవచ్చు.