లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి గత రెండు నెలలుగా ఢిల్లీ, తిహార్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఆ పార్టీ నేతలు బాల్క సుమన్, ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఉదయం కలిసి మాట్లాడారు.
అనంతరం వారిద్దరూ బయట మీడియాతో మాట్లాడుతూ, “కల్వకుంట్ల కవిత మానసికంగా చాలా ధైర్యంగానే ఉన్నారు. న్యాయస్థానంలో తనకు తప్పక న్యాయం జరుగుతుందని బెయిల్ దొరుకుతుందనే నమ్మకంతోనే ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు స్కామే కాదు. బీజేపీ పాలసీలలో అదీ ఒకటి. దేశంలో ప్రతిపక్షాల నుంచి ఎదురే ఉండకూడదనే ఆలోచనతో బీజేపీ రూపొందించుకున్న పాలసీ అది.
సీబీఐ, ఈడీలు కల్వకుంట్ల కవితపై అనేక ఆరోపణలు చేశాయే కానీ ఇంతవరకు ఆమె నేరం చేసిన్నట్లు నిరూపించలేకపోయాయి. ఆమె నుంచి ఒక్క రూపాయి రికవర్ చేయలేకపోయాయి. కానీ విచారణలో కొందరి పేర్లు చెప్పాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆమె తెలిపారు.
మోడీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పి వాటితో ఇలా తప్పుడు కేసులు తయారు చేయించి వేదిస్తోంది. ఈ కేసు పేరుతో ఢిల్లీలో ఆమాద్మీ పార్టీని, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
దేశంలో అన్ని రాష్ట్రాలు తమ ఆదాయం పెంచుకోవడం కోసం లిక్కర్ పాలసీని రూపొందించుకొని అమలు చేస్తుంటాయి.ఢిల్లీ ప్రభుత్వం కూడా అలాగే తమ పాలసీని రూపోదించుకుని అమలుచేస్తోంది. దాంతో కల్వకుంట్ల కవితకి ఏమి సంబంధం? మోడీ ప్రభుత్వానికి ఈ కేసులో ఎదురు దెబ్బ తప్పదు,” అని అన్నారు.