వర్ధన్నపేటలో నలుగురు ఇంటర్ విద్యార్దులు మృతి

April 25, 2024
img

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో విషాద ఘటన జరిగింది. పట్టణం శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్దులు మృతి చెందారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం మృతులలో పొన్నం గణేశ్ (17) వర్ధన్నపేటకు చెందినవాడు కాగా, మల్లెపాక సిద్ధు (17), వరుణ్ తేజ్ (17), పొన్నాల రనీల్ కుమార్‌ (17) ముగ్గురూ ఇల్లంద గ్రామానికి చెందినవారు. 

బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో వీరు నలుగురు ఉత్తీర్ణులవడంతో అందరూ కలిసి పార్టీ చేసుకునేందుకు ఒకే ద్విచక్రవాహనంపై బుధవారం రాత్రి ఇల్లంద నుంచి వర్ధన్నపేటకు వెళుతుండగా, హనుమకొండ నుంచి తిరిగివస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. 

ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోగా, మరో విద్యార్ధి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వీరు ఏకైక కుమారులు కావడంతో తల్లితండ్రులు శోకానికి అంతే లేదు. ముగ్గురు విద్యార్దులు ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఇల్లందలో తీవ్ర విషాదం నెలకొంది.

Related Post