లోక్సభ 4వ విడత ఎన్నికలతో పాటు మే 13న ఏపీ శాసనసభ ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకొని కలిసి పోటీ చేస్తుండగా అధికార వైసీపి ఒక్కటీ ఒంటరిగా వాటిని ఎదుర్కొబోతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఇటీవల రూ.5 కోట్లు బహుమతిగా అందజేసి ఆశీర్వదించారు. తాజాగా కూటమికే తన మద్దతు అని చిరంజీవి ప్రకటించారు.
దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ, “చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించడం మాకు ఆశ్చర్యం కలిగించలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసమే పుట్టాడు... పెరిగాడు.. బ్రతుకుతున్నాడు. చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితేనే కదులుతాడు... మాట్లాడుతాడు.
ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయ అధ్యాయం కూడా ముగిసిపోతుంది. ఏపీలో ఎవరు ఎటువైపు అనే దానిపై ఇప్పుడు పూర్తి స్పష్టఠ వచ్చింది. తోడేళ్ళు, గుంట నక్కలు, ముళ్ళ పందులు అన్నీ ఏకమైయ్యాయి. కానీ ఎంతమంది కలిసొచ్చినా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే వారందరినీ ఒంటరిగా ఎదుర్కొని ఓడించబోతున్నారు,” అని అన్నారు.