ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమాకి కొనసాగింపుగా జై హనుమాన్ తీసేందుకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి సంబందించి ఓ అద్భుతమైన పోస్టర్ విడుదల చేశాడు.
దానిలో చైనా డ్రాగన్ పై నుంచి హనుమంతుడిపై నిప్పులు కక్కుతున్నట్లు చూపారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో పూర్తయింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయని త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని ప్రశాంత్ వర్మ చెప్పాడు. ఇకపై తాను తీయబోయే ఇటువంటి సినిమాలన్నీ 2డి తో పాటు 3డిలో కూడా రిలీజ్ చేస్తానని చెప్పాడు.
ఈ సినిమా హనుమాన్కి మించి ఉంటుందని హాలీవుడ్ సినిమాలకు తీసిపోని స్థాయిలో ఉంటుందని ప్రశాంత్ వర్మ ముందే చెప్పాడు. కనుక ఈ సినిమాలో దేశంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సినీ నటులతో పాటు ఒకరిద్దరు విదేశీ నటులు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా ఇటీవలే థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడం తెలుగు సినీ చరిత్రలో మరో తాజా రికార్డనే చెప్పాలి. ఈ సినిమా ఇప్పటికే జీ5 ఓటీటీలో ప్రసారం అవుతున్నా ఇంకా థియేటర్లలో ఆడుతుండటం కూడా మరో సరికొత్త రికార్డే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.