అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 24, 25 తేదీలలో ట్రంప్ భారత్లో పర్యటించబోతున్నట్లు వైట్ హౌస్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఆయనతో పాటు భార్య మెలానియా కూడా భారత్ వస్తున్నారు. ఈ రెండురోజులలో ట్రంప్ దంపతులు డిల్లీ, అహ్మదాబాద్ నగరాలలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భారత్-అమెరికాల మద్య పలు వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అలాగే భారత్- అమెరికా దేశాల మద్య వాణిజ్య పన్నుల విధింపులో నెలకొన్న వివాదాలు కూడా పరిష్కరించుకొనే అవకాశం ఉంది. అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు, సైనిక సామాగ్రి కొనుగోలు ఒప్పందాలు కూడా మోడీ-ట్రంప్ భేటీలో ఖరారయ్యే అవకాశం ఉంది. కశ్మీర్ సమస్యలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ పదేపదే ప్రకటనలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్కు ఈసమావేశంలో భారత్ వైఖరిని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేసే అవకాశం ఉంది. అలాగే వ్యూహాత్మక రక్షణ అంశాలపై ఈ పర్యటనలో ఇరుదేశాల ఉన్నతాధికారులు అధికారులు చర్చించనున్నారు.
డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనతో భారత్-అమెరికా మద్య బందం మరింత బలపడటమే కాకుండా వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆయనకు చాలా లబ్ది పొందే అవకాశం కూడా ఉంది. ఈ ఏడాది నవంబరులో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ పోటీ చేస్తునందున, అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసభారతీయులను మెప్పించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుంది.