ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విభిన్నంగా స్పందించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, “అమెరికా ఎప్పుడూ శాంతినే కోరుకొంటుంది. అందుకే కరడుగట్టిన ఉగ్రవాది ఖాసీం సులేమానిని మత్తుబెట్టాం. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సి ఉంది కానీ ఆలస్యమైంది. ఒక ఉగ్రవాదిని మట్టుబెడితే అందుకు ప్రతీకారంగా ఇరాక్లోని మా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు నిరూపించుకొంది. అయితే ఇరాన్లో ఇటువంటిదేదో చేయవచ్చని భావించిన మేము చేపట్టిన ముందస్తు జాగ్రత్తచర్యల వలన ఇరాన్లో దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. ఒక్క అమెరికన్ సైనికుడు కూడా గాయపడలేదు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా అద్దుకొంటాము. అవసరమైతే ఇరాన్పై కటినమైన ఆంక్షలు విధిస్తాము. ఇప్పటికైనా ఇరాన్ తన వైఖరిని మార్చుకొంటుందని ఆశిస్తున్నాను,” అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఇరాన్ ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా చాలా వేగంగా, భీకరంగా ఎదురుదాడులు చేస్తామని గట్టిగా హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ తమ సైనిక స్థావరాలపై ఏకంగా 12 క్షిపణులను ప్రయోగించి దాడి చేసినా ఈవిధంగా శాంతిమంత్రం పటిస్తుండటం చాలా ఆశ్చర్యకరమే. ఐక్యరాజ్యసమితి, ప్రపంచదేశాల ఒత్తిడి కారణంగా ట్రంప్ కాస్త వెనక్కు తగ్గి ఉండవచ్చు. అమెరికా స్థావరాలపై దాడులు చేయడం ద్వారా అమెరికాకు చెంపదెబ్బ కొట్టామని, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనాని మున్ముందు మరిన్ని దాడులు చేయబోతున్నామని చెప్పిన ఇరాన్ కూడా అమెరికాతో రాజీకి సిద్దపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కనుక ఇరుదేశాలు సంయమనం పాటిస్తే ఇక్కడితో యుద్ధం ఆగుతుంది లేకుంటే అమెరికా చేతిలో ఇరాన్ విధ్వంసం తప్పకపోవచ్చు.