అమెరికాలోని మిచిగావ్లో శుక్రవారం జరిగిన కారు ప్రమాదంలో ‘బ్రెయిన్ డెడ్’ అయిన హైదరాబాద్ నేరేడ్ మెట్కు చెందిన చరితారెడ్డి తాను చనిపోతూ తొమ్మిది మంది అమెరికన్ల జీవితాలలో వెలుగులు నింపింది. ఆమె తల్లితండ్రుల అనుమతితో అమెరికాలో వైద్యులు ఆమె కిడ్నీలు, కళ్ళు, కాలేయం, గుండె కవాటాలను తీసి ఇతరులకు అమర్చారు.
చరితారెడ్డి తల్లితండ్రులు చంద్రారెడ్డి, శోభ దంపతులు నేరేడ్ మెట్లోని రేణుకానగర్లో నివాసం ఉంటున్నారు. ఆమె ఉన్నత విద్యలభ్యసించి పెద్ద ఉద్యోగంలో స్థిరపడటంతో త్వరలోనే పెళ్లి చేసేందుకు తల్లితండ్రులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే పనిమీద ఆమె మరొక రెండు నెలలో హైదరాబాద్ రావడానికి ఏర్పాట్లు చేసుకొంది కూడా. కానీ అంతలోనే మృత్యువు ఆమెను కబళించింది. పెళ్ళి చేసి భర్తతో సాగనంపాలనుకొంటే శ్మశానానికి సాగనంపాల్సిరావడంతో ఆమె తల్లితండ్రుల శోకానికే అంతే లేదు. త్వరలోనే ఆమె మృతదేహాన్ని అమెరికా నుంచి హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.