అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆనవాయితీ ప్రకారం వైట్హౌసులోని ఓవల్ కార్యాలయంలో శుక్రవారం కొందరు భారతీయ ప్రముఖుల సమక్షంలో దీపాలు వెలిగించి దీపావళి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా నివశిస్తున్న భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
“అమెరికాలో దీపావళి వేడుకలు జరుపుకోవడం మా దేశంలోని మత స్వేచ్ఛకు నిదర్శనం. దీపావళి పండుగ చీకటిపై వెలుతురు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి చిహ్నం. ఇంత గొప్ప పండుగను జరుపుకొంటున్న హిందువులు, జైనులు, సిక్కులు, బుద్దిస్టులకు నా తరపున, నా భార్య మేలానియా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను,” అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.