తెలంగాణాకు చెందిన శరత్ కొప్పు(25) అమెరికాలో కాన్సాస్ లో ఒక నల్లజాతీయుడి చేతిలో హత్య చేయబడిన సంగతి అందరికీ తెలుసు. అతనిని హత్య చేసిన హంతకుడి ఆచూకీ కనిపెట్టిన అమెరికా పోలీసులు మొన్న ఆదివారం అతనిని చుట్టుముట్టి పట్టుకొనేందుకు ప్రయత్నించారు. కానీ అతను వారికి లొంగిపోకుండా వారిపై కాల్పులు జరిపి తప్పించుకొనేందుకు ప్రయత్నించాడు. దాంతో పోలీసులు కూడా అతనిపై కాల్పులు జరుపడంతో హతమయ్యాడు.
మిస్సోరీ రాష్ట్రంలోని కాన్సాస్ లో ఒక రెస్టారెంట్ లో పార్ట్-టైమ్ ఉద్యోగం చేసుకొంటూ ఎంఎస్ చేస్తున్న శరత్ పై ఆ నల్లజాతీయుడు జూలై 6వ తేదీన కాల్పులు జరిపి పారిపోయాడు. తన జీవితంలో ఎన్నడూ చూడని ఒక అపరిచితుడి చేతిలో శరత్ అన్యాయంగా చనిపోగా, పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో హంతకుడు చనిపోయాడు. ఒక నేరానికి రెండు నిండు ప్రాణాలు పోయాయి.