అమెరికాలో మరో దారుణం

March 24, 2017
img

అమెరికాలో బర్లింగ్ టన్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆంధ్రాకు చెందిన తల్లి, ఆరేళ్ళ కుమారుడిని గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి అతిపాశవికంగా హత్య చేశారు. ఆంధ్రాలోని ప్రకాశం జిల్లాలో తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా హనుమంతరావు తన భార్య శశికళ, ఆరేళ్ళ కుమారుడు హనీస్ సాయితో కలిసి  బర్లింగ్ టన్ లో నివాసం ఉంటున్నారు. వారికి 14 ఏళ్ళ క్రితం వివాహం అయ్యింది. చాలా ముచ్చటైన కాపురం..అమెరికాలోని ఒక పెద్ద కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్ గా చక్కటి ఉద్యోగంతో వారి సంసారం పూలనావలా సాగిపోతోంది. అది ఈ సంఘటనతో అకస్మాత్తుగా నడిసంద్రంలో మునిగిపోయినట్లయింది.  

గురువారం సాయంత్రం ఆయన తన ఆఫీసు నుంచి ఇంటికి తిరిగివచ్చేసరికి ఇంట్లో భార్య, కుమారుడు రక్తం మడుగులో చనిపోయి కనిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది డబ్బు కోసం జరిగిన దోపిడీయా లేకపోతే విదేశీయుల పట్ల విద్వేషభావంతో చేసిన హత్యా? అనేది ఇంకా తెలియవలసి ఉంది. కారణం ఏదైనప్పటికీ ఒక తల్లి, పిల్లాడు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఆమె భర్తకు, ఇరు కుటుంబాల సభ్యులకు తీరని శోకం మిగిలింది. 

Related Post