అమెరికాలో మళ్ళీ కాల్పులు ఆంధ్రా యువకుడు మృతి!

April 21, 2023
img

అమెరికాలో ఒహాయో రాష్ట్ర రాజధాని వెస్ట్ కొలంబస్‌లో మళ్ళీ తుపాకుల మోత మోగింది. స్థానిక కాలమాన ప్రకారం నిన్న అర్దరాత్రి వెస్ట్‌బ్రాడ్ స్ట్రీట్‌లోగల షెల్ గ్యాస్ స్టేషన్‌లో గల ఫుడ్ కోర్టులోకి కొందరు దుండగులు తుపాకులతో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వాటిలో ఏలూరుకి చెందిన సాయేష్ వీరా (24) అనే యువకుడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. 

సాయి వీరేష్ 2021లో మాస్టర్స్ చేసేందుకు కొలంబస్‌ వెళ్ళాడు. అతని తండ్రి కొంతకాలం క్రితమే చనిపోయాడు. అతనిది మద్యతరగతి కుటుంబం కావడంతో ఖర్చుల కోసం ఫుడ్ కోర్టులో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. త్వరలోనే మంచి ఉద్యోగం సంపాదించుకొని తల్లిని, అన్నయ్యని సుఖపెట్టాలనుకొన్నాడు. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. 

సాయి వీరేష్ డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరేందుకు సిద్దమవుతుండగా దుండగులు కాల్పులలో మరణించాడు. అదే... కొన్ని నిమిషాల ముందు బయటకు వచ్చేసి ఉంటే ప్రాణాలు దక్కేవి కదా అనిపించకమానదు. కొడుకు అమెరికా వెళ్ళి ఉన్నత చదువులు చదువుతుండటంతో సాయి వీరేష్ తల్లి, అన్నయ్య కూడా అతని మీద చాలా ఆశలు పెట్టుకొన్నారు. కానీ వారికి తీరని శోకం మిగిల్చి వెళ్లిపోయాడు. ఈ నాలుగు నెలల్లో ఒక్క కొలంబస్ నగరంలోనే 50 హత్యలు జరిగాయని స్థానిక పోలీసులు తెలియజేశారు.  


Related Post