అమెరికాలో కనీవినీ ఎరుగని స్థాయిలో గత వారం రోజులుగా ఏకధాటిగా మంచుతుఫాను కురుస్తోంది. ఆ దెబ్బకి ప్రఖ్యాత నయాగరా ఫాల్స్ కూడా గడ్డ కట్టేసింది. దానిలో సెకనుకి 3,160 టన్నుల నీరు సెకనుకి 32 అడుగుల వేగంతో ప్రవహిస్తుంటుంది. అంత నీరు ఐస్ ముక్కలా గడ్డ కట్టేసి భారీ మంచుముక్కలుగా ఏర్పడి పైనుంచి కిందకి పడుతున్నాయి.
నయాగరా వాటర్ ఫాల్స్కి సుమారు 25 మైళ్ళ దూరంలో ఉన్న బఫెలో కౌంటీలో ఇళ్ళు, వాహనాలు అన్ని మంచులో కూరుకుపోయాయి. దానికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఇళ్ళలో హీటర్స్ పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. న్యూయార్క్ నగరంలో కూడా భారీగా మంచు కురుస్తుండటంతో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. అమెరికాలో ఈ మంచుతుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పడిపోయి మైనస్ డిగ్రీలలో నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలోని గుంటూరుకి చెందిన దంపతులతో సహా ఇప్పటివరకు మొత్తం 60 మంది ఈ మంచుతుఫానులో చిక్కుకొని చనిపోయారు. బఫెలో కౌంటీలో కారులో చిక్కుకొన్న ఓ యువతి మంచులో చిక్కుకుపోయి చనిపోయింది. చనిపోయే ముందు ఆ యువతి సోషల్ మీడియాలో పంపిన సందేశాలు చూసి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కనీవినీ ఎరుగని స్థాయిలో కురుస్తున్న ఈ మంచుతుఫాను కారణంగా అమెరికాలో 4,000కి పైగా దేశీయ, అంటార్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి.