ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం ప్రారంభించింది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలు నేలమట్టమయ్యాయి కానీ ఉక్రెయిన్ మాత్రం రష్యాకి లొంగలేదు. దీంతో యుద్ధం పూర్తవడంలేదు. కానీ యుద్ధం పూర్తయిపోయింది. రష్యా సేనలు వెనక్కు వెళ్లిపోతున్నాయని ఉక్రెయిన్ వాసులు మంగళవారం పండుగ చేసుకొంటుంటే, ఒకటీ రెండూ కాదు ఏకంగా 100 క్షిపణులతో మళ్ళీ రష్యా విరుచుకుపడింది.
వాటిలో రెండు క్షిపణులు పొరపాటున పడ్డాయో లేక కావాలనే వేసిందో తెలియదు కానీ ఉక్రెయిన్ పొరుగునే గల యూరోపియన్ (నాటో) దేశం పోలాండ్లో పడ్డాయి. ఆ దాడిలో ఇద్దరు పోలాండ్ పౌరులు చనిపోయారు. దీంతో పోలాండ్తో సహా యావత్ యూరోపియన్ దేశాలు, అమెరికా కూడా అప్రమత్తమయ్యాయి.
గత 9 నెలలుగా ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్నప్పటికీ ఇరుగు పొరుగుదేశాలపై ఎన్నడూ దాడులు చేయలేదు. కనుక ఇది పొరపాటున పడి ఉండవచ్చని పోలాండ్ ప్రభుత్వం భావిస్తోంది. అయినప్పటికీ దీనిపై వివరణ ఇవ్వాలని మాస్కో రాయబారిని కోరినట్లు పోలాండ్ ప్రభుత్వం తెలిపింది.
ఇండోనేసియాలో బాలినగరంలో జీ-20 సమావేశాలు జరుగుతుండగా ఈ దాడి జరగడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ-7, నాటో దేశాల నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఇవన్నీ పోలాండ్ రష్యా దాడిని ఖండిస్తూ ఓ సంయుక్త ప్రకటన చేయనున్నాయి.
జో బైడెన్ ఈ ఘటనపై స్పందిస్తూ, “ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు పోలాండ్ ప్రభుత్వానికి మేము అన్ని విదాలా సహకరిస్తాము,” అని అన్నారు.
ఒకవేళ ఈ యుద్ధాన్ని పోలాండ్ దేశానికి విస్తరించాలనే ఉద్దేశ్యంతోనే రష్యా ఈ పనిచేసినట్లయితే నాటో దేశాలు పోలాండ్కి మద్దతుగా రష్యాని నిలువరించేందుకు ముందుకు వస్తాయి. అది మూడో ప్రపంచయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.