ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు మృతి

March 11, 2022
img

సికింద్రాబాద్‌ రెజిమెంటల్ బజార్‌ ప్రాంతానికి చెందిన సాయి సూర్య తేజ (25) అనే యువకుడు ఆస్ట్రేలియాలో ఈత కొలనులో మునిగి చనిపోయాడు. సాయి సూర్య తేజ సుమారు నాలుగేళ్ళ క్రితం ఆస్ట్రేలియాకు వెళ్ళి ఉన్నత విద్యలు పూర్తి చేసిన తరువాత అప్పటి నుంచి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఓ ప్రమాదంలో అతని కాలికి తీవ్రగాయమైంది. శస్త్రచికిత్స కూడా చేయవలసి ఉండటంతో అతని తల్లితండ్రులు రాచకొండ శ్రీనివాస్, అరుణలు ఆస్ట్రేలియాకు వెళ్లడానికి సిద్దపడ్డారు. కానీ ఆ సమయంలో కరోనా కారణంగా అంతర్జాతీయ విమానసేవలు రద్దు కావడంతో వెళ్ళలేకపోయారు. అప్పటి నుంచి సాయి సూర్య తేజ అక్కడే ఉంటూ ఫిజియో థెరపీ చేయించుకొంటున్నాడు. వైద్యుల సలహా మేరకు ఏప్రిల్ నెలలో కాలుకి శస్త్ర చేయించుకోవాలని చెప్పడంతో అతని తల్లితండ్రులు ఆస్ట్రేలియా బయలుదేరేందుకు టికెట్స్ కూడా కొనుకొన్నారు. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. 

నాలుగు రోజుల క్రితం వైద్యుల సలహా మేరకు సాయి సూర్య తేజ ఓ స్థానిక హోటల్లోని స్విమ్మింగ్‌పూల్‌లో దిగి ఈత కొడుతుండగా మునిగిపోయాడు. ఆ సమయంలో చుట్టూ పక్కల ఎవరూ లేకపోవడంతో అతనిని కాపాడలేకపోయారు. నాలుగేళ్ళ తరువాత కొడుకును చూసేందుకు బయలుదేరుతున్న అతని తల్లితండ్రులు ఈ వార్త విని షాక్ అయ్యారు. కొడుకును చూడాలనుకొంటే కొడుకు మృతదేహం కోసం ఎదురు చూడాల్సి వస్తోందని వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Related Post