అమెరికా చరిత్రలోకెల్లా అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా అపఖ్యాతి మూటగట్టుకొన్న వ్యక్తి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలు ఫలితాలు వెలువడి ఓడిపోయే వరకు తనదైన శైలిలోనే వ్యవహరిస్తూ అత్యంత అవమానకరంగా నిష్క్రమించారు. అయినప్పటికీ ట్రంప్ తీరు మారలేదు నేటికీ తగ్గేదేలే...అంటున్నారు. ఎన్నికలకు ముందు సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, ట్విట్టర్ ట్రంప్పై నిషేదం విధించడంతో వాటికి ధీటుగా మరొక సోషల్ మీడియా యాప్ను తీసుకువస్తానని ఆనాడే ట్రంప్ శపధం చేశారు. బిలియనీర్ అయిన ట్రంప్ తలచుకొంటే సాధ్యం కానిదేముంటుంది? అక్టోబర్,2021లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ను స్థాపించి దాని ద్వారా ‘ట్రూత్ సోషల్’ అనే సామాజిక యాప్ను తయారుచేయించి మొన్న ఆదివారంనాడు యాపిల్ యాప్ స్టోర్లో విడుదల చేశారు. మార్చి నెలాఖరుకి అన్ని ఫార్మాట్లలో పూర్తిస్థాయిలో ట్రూత్ సోషల్ను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తానని ట్రంప్ చెప్పారు.
దీంతో డోనాల్డ్ ట్రంప్ తన ఖాతపై నిషేదం విధించిన ఫేస్బుక్, సోషల్ మీడియాలకు గట్టి సవాలు విసురబోతున్నారు. అలాగే జో బైడెన్ ప్రభుత్వ పనితీరుపై తనదైన శైలిలో తన సొంత సోషల్ మీడియాలో స్వేచ్ఛగా విమర్శలు గుప్పిస్తూ ఈ ట్రూత్ సోషల్ ద్వారా మళ్ళీ అమెరికా ప్రజలను ఆకట్టుకోగలిగితే, వచ్చే ఎన్నికలనాటికి డోనాల్డ్ ట్రంప్ తన బలం పెంచుకోగలుగుతారు. అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోయినా తానే గెలిచానని మొండిగా వాదించిన డోనాల్డ్ ట్రంప్, ఇన్ని ఎదురుదెబ్బలు తిన్నా మళ్ళీ పోరాటానికి సిద్దపడుతుండటం విశేషం.