అమెరికాలో స్థిరపడ్డ తెలుగు అమ్మాయి రేష్మా కొసరాజు (15) అమెరికా ప్రతిష్టాత్మక చిల్డ్రన్స్ క్లైమేట్-2021 అవార్డు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడే పిల్లలకు చిల్డ్రన్స్ క్లైమేట్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం అవార్డులు అందిస్తుంటుంది. రేష్మా కొసరాజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అడవుల్లో కార్చిచ్చులను ముందే పసిగట్టే పరికరాన్ని రూపొందించినందుకుగాను ఈ అవార్డు ఆమెను వరించింది. రేష్మ కుటుంబం కాలిఫోర్నియా రాష్ట్రంలోని సరటోగా ఏరియాలో స్థిరపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా నిరంతరం ఏదో మూలన అడవుల్లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. వాటితో లక్షల సంఖ్యలో జంతువుల మరణిస్తుండటమే కాక పర్యావరణం కూడా దెబ్బతిని ఉష్ణోగ్రతలు పెరగడం, ఆకస్మిక వరదలు వంటివి ఏర్పడుతున్నాయి. పర్యావరణ కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం మూడు లక్షల మందికి పైగా మృతి చెందునట్లు అంచనా. కనుక రేష్మా కొసరాజు కనిపెట్టిన ఈ పరికరం ఈ పెను సమస్యకు చక్కటి పరిష్కారం కాగలదని చిల్డ్రన్స్ క్లైమేట్ ఫౌండేషన్ భావించి ఆమెకు ఈ అవార్డు అందజేసింది.