సూర్యాపేట జిల్లాకు చెందిన చిరుసాయి (22) అనే యువకుడు అమెరికాలోని ఒహియో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సూర్యాపేట పట్టణంలోని నల్లబావి ప్రాంతంలో నివాసముంటున్న నరేంద్రుని లింగమూర్తి, సుధారాణి దంపతుల కుమారుడు చిరుసాయి. సుమారు ఏడాది క్రితం ఓహియో యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు వెళ్ళాడు. డిసెంబర్ 15వ తేదీన భారత్ వచ్చేందుకు టికెట్స్ కొనుకొన్నాడు.
అమెరికా నుంచి తొలిసారి వస్తునందున శనివారం రాత్రి మార్కెట్కు వెళ్ళి తల్లితండ్రులకు, బంధుమిత్రులకు ఇచ్చేందుకు బహుమతులు షాపింగ్ చేసి కారులో తిరిగివస్తుండగా కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో చిరుసాయి ఘటనాస్థలంలోనే మృతి చెందగా, అతనితోపాటు కారులో ప్రయాణిస్తున్న నల్గొండకు చెందిన యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది.
మరో రెండువారాలలో కొడుకు వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న చిరుసాయి తల్లితండ్రులు ఈ వార్త విని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిరుసాయి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ప్రయత్నిస్తున్నారు.