అమెరికాలో స్థిరపడ్డ తెలుగు అమ్మాయి రేష్మా కొసరాజు (15)కు అమెరికా ప్రతిష్టాత్మక చిల్డ్రన్స్ క్లైమేట్-2021అవార్డు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడే పిల్లలకు చిల్డ్రన్స్ క్లైమేట్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం అవార్డులు అందిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికఠ ద్వారా అడవుల్లో కార్చిచ్చులను ముందే పసిగట్టే విధానాన్ని రూపొందించేందుకు గాను రేష్మను ఈ అవార్డు వరించింది. రేష్మ కుటుంబం కాలిఫోర్నియా రాష్ట్రంలోని సరటొగా నగరంలో స్థిరపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా నిరంతరం ఏదో మూలన అడవుల్లో కార్చిచ్చు రగులుతోంది. ఆ ప్రభావంతో లక్షల సంఖ్యలో చెట్లు, జంతువులు నశించిపోతుంటాయి. పైగా పర్యావరణం దెబ్బతినడంతో ఆకస్మిక వరదలు, ఉష్ణోగ్రతలు పెరగడం వంటివి దుష్ఫలితాలు కూడా ఏర్పడుతున్నాయి. పర్యావరణ కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం మూడు లక్షల మందికి పైగా మృతి చెందినట్లు అంచనా.