అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తైవాన్ దేశానికి చాలా ఊరట కలిగించే ప్రకటన చేశారు. జో బైడెన్ వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడుతూ, “తైవాన్ మాకు మిత్రదేశం. అవసరమైతే చైనాను ఎదిరించి దానిని మేము కాపాడుతాము. మా సైనిక శక్తి సామర్ధ్యాలు ఏమిటో చైనాకు తెలుసు. కనుక తైవాన్ విషయంలో చైనా తొందరపాటు, అత్యుత్సాహం ప్రదర్శించదని భావిస్తున్నాం,” అని అన్నారు. తైవాన్ విషయంలో అమెరికా విధానాలలో ఎటువంటి మార్పు లేదని వైట్హౌస్ అధికారులు తెలిపారు. ఇప్పుడు సాక్షాత్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా తైవాన్కు అండగా నిలబడతామని చెప్పడంతో తైవాన్ విషయంలో చైనా పునరాలోచించుకోక తప్పని పరిస్థితి కల్పించారు.
తైవాన్ దేశాన్ని 2025లోగా చైనాలో కలిపేసుకొంటామని తమను ఎవరూ అడ్డుకోలేరంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇటీవల ప్రకటించడమే కాక తైవాన్పై తమ ఆధిక్యతను ప్రదర్శిస్తూ 52 యుద్ధ విమానాలను ఆ దేశ గగనతలంలోకి పంపించారు. చైనా దూకుడు చూసి తైవాన్ చాలా ఆందోళన చెందుతోంది. ఇటువంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ఈ ప్రకటన తైవాన్ ప్రజలకు, ప్రభుత్వానికి కూడా చాలా ఉపశమనం కలిగిస్తుంది.