కరోనా కారణంగా హైదరాబాద్లోని అమెరికన్ కౌన్సిలెట్ వీసాలు జారీ చేసే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం మే 3వ తేదీన జరుగవలసిన ఇంటర్వ్యూలు తదితర ప్రక్రియలను, అలాగే అమెరికన్ సిటిజన్ సర్వీసస్కు సంబందించిన ఇంటర్వ్యూ అపాయిం ట్మెంట్లను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నంతవరకు అమెరికాపౌరుల అత్యవసరసేవలు, వీసా అపాయింట్మెంట్లను యధాతధంగా కొనసాగిస్తామని తెలిపింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుంటామని పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చినప్పుడు భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను పునః ప్రారంభిస్తామని అమెరికన్ కౌన్సిలెట్ తెలిపింది.
భారత్లో కరోనా తీవ్రత పెరిగినప్పటి నుంచి చాలా దేశాలు భారత్ నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. ఇప్పుడు వీసాల జారీ నిలిపివేయడం ద్వారా అమెరికా కూడా తలుపులు మూసేసింది. ఇప్పుడిప్పుడే అమెరికాలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నందున భారత్ నుంచి అమెరికా వెళ్లాలనుకొనేవారికి మళ్ళీ అవకాశాలు పెరుగుతాయనుకొంటే, భారత్లో హటాత్తుగా కరోనా విజృంభణతో పరిస్థితులు తారుమారయ్యాయి. అమెరికా వెళ్ళాలని ఎదురుచూస్తున్న భారతీయులకి ఇది పెద్ద షాక్ అనే భావించవచ్చు.