అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో సహా మరో 12 మంది భారత సంతతికి చెందినవారు కీలకపదవులలో నియుక్తులైన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా భారత సంతతికి చెందిన అమెరికా సెనేటర్లు రాజాకృష్ణమూర్తి (47), ప్రమీలాజయపాల్ (55)లకు కీలక బాధ్యతలు అప్పగించబడ్డాయి. యూఎస్ కాంగ్రెస్ కమిటీలలో బడ్జెట్ కమిటీకి ప్రమీలా జయపాల్, కరోనా కట్టడికి ఏర్పాటు చేయబడిన కమిటీకి రాజాకృష్ణమూర్తి సభ్యులుగా నామినేట్ అయ్యారు.
జో బైడెన్ నేతృత్వంలో అమెరికాలో నెలకొన్న సమస్యలన్నిటినీ పరిష్కరించి దేశాన్ని మళ్ళీ అభివృద్ధిపదంలో నడిపించేందుకు శక్తివంచనలేకుండా కృషి చేస్తామని వారు చెప్పారు. తమపై నమ్మకం ఉంచి ఇంత కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు వారిరువురూ యూఎస్ కాంగ్రెస్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.