భారత్-పాక్ మద్య ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు భారత్కు అండగా నిలబడినా అమెరికా, వ్యాపారలావాదేవీల విషయంలో భారత్పట్ల కటినంగా వ్యవహరిస్తుండటం విశేషం. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న అనేక ఉత్పత్తులపై భారీగా పన్ను విధిస్తామని ఇటీవల హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్, తాజాగా భారత్కు ‘వాణిజ్య ప్రాధాన్యత హోదా’ను రద్దు చేయాలనుకొంటున్నట్లు చెప్పారు. భారత్ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లలో అమ్ముకొనేందుకు వీలుగా కొన్ని వెసులుబాట్లు కల్పించాము కానీ అదేవిధంగా అమెరికా ఉత్పత్తులను భారత్లో అమ్ముకొనేందుకు వెసులుబాటు కల్పించాలనే మా అభ్యర్ధనను భారత్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే భారత్కు ‘వాణిజ్య ప్రాధాన్యత హోదా’ను రద్దు చేయాలనుకొంటున్నట్లు కాంగ్రెస్ (పార్లమెంటు)కు లేఖ వ్రాశాను,” అని ట్రంప్ చెప్పారు.
భారత్కు ‘వాణిజ్య ప్రాధాన్యత హోదా’ను రద్దు చేసి, భారత్ ఉత్పత్తులపై పన్ను పెంచితే భారత్ తీవ్రంగా నష్టపోవడం ఖాయం. అయితే సాధారణ ప్రాధాన్యత విధానంలో భారత్ నుంచి అమెరికాకు ఏటా 5.6 బిలియన్ డాలర్ల వస్తువులను ఎగుమతి చేస్తోంది. కనుక ‘వాణిజ్య ప్రాధాన్యత హోదా’ను రద్దు చేసినప్పటికీ భారత్పై పెద్దగా ప్రభావం పడబోదని భారత్ వాణిజ్యశాఖ కార్యదర్శి అనూప్ వాధవన్ అన్నారు. కానీ భారత్ నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై పన్ను పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చెపుతున్నప్పుడు, భారత్కు నష్టం ఉండదనుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది.