హెచ్-1 బి వీసాల జారీ విషయంలో ట్రంప్ సర్కార్ చాలా కటినమైన ఆంక్షలు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. కనుక హెచ్-1 బి వీసాలకు దరఖాస్తు చేసుకొనేటప్పుడు ఐటి కంపెనీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం కనిపిస్తోంది. కానీ ఇటువంటి సమయంలో కూడా నకిలీ దృవపత్రాలతో హెచ్-1 బి వీసాలు పొందాలని ప్రయత్నించేవారున్నారంటే నమ్మశఖ్యంగా లేదు. కానీ ఉన్నారని నిరూపించారు అమెరికా పోలీస్ అధికారులు.
భారత్ కు చెందిన ప్రద్యుమ్న కుమార్ సామల్ (49) అమెరికాలో అజీమెట్రీ, డివెన్సి అనే రెండు ఐటీ కంపెనీలకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిన్న భారత్ నుంచి అమెరికా తిరిగి వస్తుండగా సియాటేల్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన 200 మంది విదేశీయులకు నకిలీ దృవపత్రలతో హెచ్-1 బి వీసాలను ఇప్పించాడని వారి ఆరోపణ. అతను 2011,11 సం.లలోనే అతను హెచ్1 బీ వీసాలు, గ్రీన్ కార్డుల కోసం ప్రజలను మోసగించాడని, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అతనిపై హెచ్-1 బి వీసా కేసు విచారణ జరుగుతుండగా అతను పారిపోయాడని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పారు. ఈ కేసులో నేరం నిరూపించబడితే ప్రద్యుమ్న కుమార్ సామల్కు 10 ఏళ్ళు జైలు శిక్షతో పాటు 25,000 డాలర్లు జరిమానా విధించబడే అవకాశం ఉంది.