మంత్రి పదవి పోయిన తర్వాత కొండా కుటుంబం పరిస్థితి అయోమయంగా మారింది. బిజేపి, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఆమె తమకు అవసరం లేదని స్పష్టం చేయడమే ఇందుకు కారణం. ఒకవేళ వాటిలో ఒకటి కొండా దంపతులను తమ పార్టీలోకి ఆహ్వానించి ఉండి ఉంటే, వారు ఆ పార్టీలో చేరి ఉండి ఉంటే, ఈపాటికి ఆమె సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ఉండేవారు.
కానీ రెండు ప్రధాన పార్టీలు తలుపులు మూసేయడం, ఇంత అవమానం జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేని పరిస్థితి నెలకొంది. కనుక ఇది కొండా దంపతులకు, ముఖ్యంగా కొండా సురేఖ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారినట్లే అనిపిస్తుంది.
కానీ ఆమెకు ఇంకా కొంచెం అదృష్టం మిగిలి ఉంది. బహుశః అందువల్లేనెమో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమెకు ఫోన్ చేసి, మనసులో ఏమీ పెట్టుకోకుండా ఎప్పట్లా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయమని కోరారు.
ఈ పరిస్థితిలో మీనాక్షి నటరాజన్ నుంచి ఇటువంటి సూచన రావడం కొండా సురేఖకు చాలా ఊరటనిచ్చే విషయమే. ఆమె మాటలు మన్నించి తక్షణమే పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకపోయినా, కనీసం తాము కాంగ్రెస్ పార్టీ గొడుగు కిందే ఇంకా ఉన్నామనే భావనే వారికి ధైర్యం కలిగిస్తుంది. కనుక కాంగ్రెస్ కార్యక్రమాలలో కొండా సురేఖ పాల్గొంటారా లేదా నేడో రేపో తెలుస్తుంది.