తెలంగాణ రాష్ట్రంలో నకిలీ పనీర్ తయారీ, విక్రయాలు జోరుగా సాగుతూ ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. కనుక తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాలు లేకుండా తయారు చేస్తున్న కృత్రిమ పనీ నిషేధం విధించింది. ఈ కృత్రిమ పనీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలపై సెప్టెంబర్ 10 నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006లోని సెక్షన్ 30(2)(ఏ) కింద ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో పాలతో బదులు వెజిటబుల్ ఆయిల్స్, ఇండస్ట్రియల్ స్టార్చ్లతో నకిలీ పనీర్ తయారు చేసి చౌకగా అమ్ముతున్నారు. అయితే ఈ విషయం తెలియని సామాన్య ప్రజలతో పాటు హోటల్స్, కర్రీ పాయింట్స్, స్వీట్ షాప్స్, బేకరీలలో విస్తృతంగా చౌకగా లభిస్తున్న ఈ పన్నీరు ఉపయోగిస్తున్నాయి.
ఈ నకిలీ పన్నీరు ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తుందని తెలిసి ఉన్నప్పటికీ ఫుడ్ ఇండస్ట్రీలో విరివిగా వాడుతున్నట్లు, ఇటీవల హైదరాబాద్ టి-సేఫ్ బృందాలు సోదాలు నిర్వహించినప్పుడు బయట పడింది. కనుక దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంతో వెంటనే స్పందించి ఏడాదిపాటు నిషేధం విధించింది.
ఇక నుంచి ఈ కృత్రిమ పన్నీరు విషయంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం కటిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
అయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం నిర్దిష్ట ప్రమాణాలతో తయారుచేసి చట్టబద్ధంగా విక్రయిస్తున్న సంస్థలు, వాటి పన్నీర్, సంబంధిత ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.