తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో సనత్ నగర్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నేటి నుంచి అవుట్ పేషంట్ (ఓపీ) సేవలు ప్రారంభమయ్యాయి. హాస్పిటల్ ఇంకా ప్రారంభోత్సవం కాకుండానే ఓపీ సేవలు ప్రారంభించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
దీనిని ఈ ఏడాది జూన్లో ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇదివరకే చెప్పారు. కనుక ముందుగా నెల రోజుల పాటు 22 విభాగాలలో ఓపీ సేవలు ప్రయోగాత్మకంగా నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అట్టహాసంగా ప్రారంభోత్సవం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నగరంలో అన్ని ప్రాంతాల నుంచి బస్ సౌకర్యం కలిగిన సనత్ నగర్లో ఇంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే, అటు పటాన్ చెరు, మియాపూర్, కూకట్పల్లి, బాలానగర్ బోయినపల్లి మొదలు ఇటు ఎర్రగడ్డ, సనత్ నగర్, యూసఫ్గూడా, అమీర్ పేట, పంజాగుట్ట, బేగంపేట, ప్రకాష్ నగర్ తదితర పరిసర ప్రాంతాల ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది.