సంచలనం సృష్టించిన కంటోన్మెంట్లోని ఆయుధాల దొంగతనం కేసును మల్కాజ్గిరి పోలీసులు చేధించారు. ఈ కేసులో మాజీ మిలటరీ అధికారి ఈ దొంగతనం చేసినట్లు గుర్తించారు. కంటోన్మెంట్లోని మద్రాస్ రెజిమెంట్లో ఆయుధగారం నుంచి అతను దొంగిలించిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తన ఇంట్లోనే దాచాడు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు గతంలో మద్రాస్ రెజిమెంట్లో పని చేశాడు. అతనికి మరో ముగ్గురు అధికారులు సహకరించారని పోలీసులు గుర్తించి వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు చెడు వ్యసనలాకు అలవాటు పడినందున సులువుగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు సమాచారం.
కానీ అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన కంటోన్మెంట్ నుంచి అతను ఈ ఆయుధాలు ఏవిధంగా దొంగిలించి బయటకు తీసుకుపోయాడు?వాటిని ఎవరికి అమ్మదలచుకున్నాడు? ఆయుధాల కొనుగోలు చేయబోతున్న వారు ఎవరు? అనే కోణంలో పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు.
మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి 12 ఏకే-47 తుపాకులు వాటిలో ఉపయోగించే 1200 రౌండ్ల బుల్లెట్లు, అత్యాధునిక ఇన్సాస్ తుపాకులను పోలీసులు అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించబడ్డ ఆయుధాలలో ఒక్కటి కూడా పోకుండా అన్నీ స్వాధీనం అవడంతో మిలటరీ ఉన్నతాధికారులు, పోలీసులు కూడా ఊపిరి తీసుకోగలిగారు.