ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి సకుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలిశారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజేపి ఎంపీ కిషన్ రెడ్డి వారిని స్వయంగా ప్రధాని మోడీ వద్దకు తోడ్కొని తీసుకు వెళ్ళారు.
ఆ తర్వాత వారు బిజేపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో కలిసి ఫోటోలు దిగారు. అంటే బిజేపిలో చేరబోతున్నట్లు సంకేతం ఇచ్చినట్లేనని అందరూ భావించారు. కానీ వారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఒక్కరే హైదరాబాద్లోని బిజేపి కార్యాలయానికి వెళ్ళి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు.
అంటే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ, కోడలిని మాత్రమే బిజేపిలోకి పంపిస్తున్నారా?లేక త్వరలో అయన కూడా బిజేపిలో చేరుతారా? అనే సందేహం కలుగుతుంది.
ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నందున ఇప్పుడు బిజేపిలో చేరితే ఆ పదవికి రాజీనామా చేయాలి లేకుంటే దాని కోసం బీఆర్ఎస్ పార్టీతో న్యాయపోరాటాలు చేయాల్సివస్తుంది. కనుక ఎన్నికలు దగ్గర పడిన తర్వాత అయన కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజేపిలో చేరిపోవచ్చు.