కాళేశ్వరం: అప్పుడు బీఆర్ఎస్‌కి ఇప్పుడు కాంగ్రెస్‌కి అగ్నిపరీక్ష!

July 16, 2026


img

కేసీఆర్‌ సిఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మాహాద్భుతమని చెప్పుకునేవారు. నేటికీ చెప్పుకుంటూనే ఉన్నారు. దాంతో ఆయనకు, బీఆర్ఎస్‌కు ఎంతగానో పేరు ప్రతిష్టలు లభించాయి. 

కానీ అది అవినీతికి నిలువెత్తు నిదర్శనమంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఆరోపణలు, కమీషన్ నివేదిక, నిపుణుల కమిటీ అభిప్రాయాలు బీఆర్ఎస్‌ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. 

కాళేశ్వరం అవినీతిపై శాసనసభలో చర్చకు రావాలని సిఎం రేవంత్ రెడ్డి పదేపదే సవాళ్ళు విసురుతున్నా, కేసీఆర్‌ వెళ్ళకపోవడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయని చెప్పవచ్చు. 

కానీ రేవంత్ ప్రభుత్వం వివిధ కారణాల వలన బాధ్యులపై చర్యలు తీసుకోలేకపోవడంతో వారి ఆరోపణల ప్రభావం ప్రజలపై క్రమంగా తగ్గినట్లు అనిపిస్తుంది. బీఆర్ఎస్‌ పార్టీ సభలకు రైతులు పోటెత్తుతుండటమే ఇందుకు నిదర్శనం.     

ఈ పరిణామాలని బీఆర్ఎస్‌ పార్టీ గుర్తించి అద్భుతంగా వినియోగించుకుంటూ, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్‌ కాదు... ఈ ప్రాజెక్టులో అనేక బ్యారేజీలు, జలాశయాలు, పంప్ హౌసులు, కాలువలు వగైరా ఉన్నాయంటూ.. బీఆర్ఎస్‌ పార్టీ సరికొత్త పోరాటం మొదలుపెట్టింది. 

ఓ పక్క ఉదృతంగా గోదావరి ప్రవహిస్తుంటే మరోపక్క నీళ్ళు లేక భూములు బీడువారిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. అయినా ప్రాజెక్టులలో మోటార్లు ఆన్‌ చేసి నీళ్ళు ఎందుకు ఎత్తిపోయడం లేదు? అంటూ బీఆర్ఎస్‌ నేతలు ప్రాజెక్టుల వద్ద పోరాటాలు మొదలుపెట్టారు. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం దేవాదుల మోటార్లు ఆన్‌ చేయక తప్పలేదు.     

తాజాగా కేటీఆర్‌ నేతృత్వంలో 50 వేల మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించి మోటార్లు ఆన్‌ చేసేందుకు సిద్దమయ్యారు.

ఒకవేళ వారికి ఆ అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తే, కాంగ్రెస్‌ మంత్రులు వెళ్ళి వాటినీ ఆన్‌ చేయించి నీళ్ళు ఎత్తిపోయక తప్పదు. చేస్తే బీఆర్ఎస్ విమర్శలకు బలం చేకూరినట్లు రాజకీయంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది.

చేయకపోతే రైతుల ప్రయోజనాల కంటే పార్టీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని కాంగ్రెస్‌ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్‌ పార్టీ వాదించకుండా ఉండదు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకునే పరిస్థితిని బీఆర్ఎస్ సృష్టించిందనిపిస్తోంది.


Related Post