Civil Aviation Minister Rammohan Naidu announced that Warangal International Airport will be ready by 2028, June 2nd .
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుకి సహకరించాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ, “వరంగల్ విమానాశ్రయం ప్రతిపాదన ఈనాటిది కాదు. ఎయిర్ పోర్ట్ అధారిటీ వద్దే సుమారు 700 ఎకరాలుంది. మరో 400 ఎకరాలు కూడా సేకరించి ఇవ్వాలని మేము గత ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదు.
కానీ సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకొని అదనపు భూసేకరణ వేగంగా పూర్తిచేసి మాకు అప్పగించారు. ఇప్పటికే విమానాశ్రయం బౌండరీ వాల్, రన్ వే నిర్మాణాలకు టెండర్లు పిలిచాము. త్వరలో టెర్మినల్ భవనాలు, ఇతర నిర్మాణ పనులకు కూడా టెండర్లు పిలిచి పనులు మొదలుపెడతాము. మరో మూడు వారాల్లో అక్కడ విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.
సిఎం రేవంత్ రెడ్డి కోరినట్లుగా 2028, జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరిపిస్తాము.
ప్రధాని మోడీ అధికారంలో వచ్చినప్పటి నుంచి దేశంలో కొత్తగా 90 విమానాశ్రయాలు నిర్మించము. ఆయన కూడా వరంగల్ విమానాశ్రయం నిర్మాణం జరగాలని పట్టుబడుతున్నారు.
కొత్తగా నిర్మించిన విమనాశ్రయాలన్నీ ఆయా రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలు, కళలను ప్రతిభింబించేలా నిర్మించాము. వరంగల్ విమానాశ్రయాన్ని కాకతీయ శిల్పకళా వైభవం ఉట్టిపడేలా అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాము. ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూసేకరణ పూర్తవగానే దాని పనులు మొదలుపెడతాము,” అని చెప్పారు.