కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ నేడు మాజీ సిఎం కేసీఆర్, మాజీ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ ముగ్గురికీ నేడు నోటీసులు పంపింది. ముందుగా వచ్చే నెల 5న కేసీఆర్, మరుసటి రోజు అంటే జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ పీసీ ఘోష్ కమీషన్ ఎదుట విచారణకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో ఛత్తీస్ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రిలో పాత టెక్నాలజీతో విద్యుత్ ప్లాంట్స్ నిర్మాణాలు ప్రారంభించడంపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి కమీషన్ ఏర్పాటు చేసింది.
ఆ కమీషన్ నోటీస్ పంపితేనే కేసీఆర్ విచారణకు హాజరుకాలేదు. పైగా తనని విచారించే అర్హత కమీషన్కి లేదంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. కనుక జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ నోటీస్ పంపితే కేసీఆర్ విచారణకు హాజరవకపోవచ్చు.
ఒకవేళ విచారణకు హాజరైతే కమీషన్ వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో కేసీఆర్ని గట్టిగా నిలదీయకమానదు. అటువంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవడం కంటే ఏదో సాకుతో విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ మొగ్గు చూపవచ్చు.