తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ‘జాగృతి జనం బాట’ పేరుతో జిల్లా పర్యటనలకు బయలుదేరబోతున్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి నిన్న పోస్టర్స్ విడుదల చేశారు.
వాటిలో కేసీఆర్ ఫోటో లేకపోవడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, “కేసీఆర్ ఫోటో పెట్టకపోవడం ఆయనని అగౌరవిస్తున్నట్లు కాదు. నేను కేసీఆర్ అనే చెట్టు నీడలోనే పెరిగాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన వెనుక కుట్రలు చేస్తున్నవారి నుంచి ఆయనని కాపాడుకునే ప్రయత్నం చేశాను. కానీ నా ప్రయత్నాల కంటే వారి కుట్రలే ఫలించాయి. సామాజిక తెలంగాణ సాధన గురించి మాట్లాడినందుకే నన్ను పార్టీలో నుంచి బహిష్కరించారు.
కనుక ఇప్పుడు తెలంగాణ జాగృతితో ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా ఆయన ఫోటో వాడుకోవడం సరికాదని భావించి ఆయన ఫోటో పెట్టలేదు. కానీ తెలంగాణ సాధించిన నేతగా, రాజకీయ గురువుగా, ఓ తండ్రిగా నేను ఎప్పుడూ ఆయనని గౌరవిస్తూనే ఉంటాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.