గత ఎన్నికలలో తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేయడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలా భిన్నంగా స్పందించారు.
“బిఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమాలే.అంతా ఎన్నికల కమీషన్ ను తప్పు దోవ పట్టించిన వాళ్లే. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలే. ఎన్నికల అఫిడవిట్లో చూపింది గోరంతైతే దాచింది కొండంత.లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతం.అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి,తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నాం,” అని ట్వీట్ చేశారు.
ఆమె చేసిన ఈ ఆరోపణ నిజమే అని అందరికీ తెలుసు. అయితే ఒక్క బిఆర్ఎస్ పార్టీలోనే కాదు... ఆమె సోదరుడు, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా దేశంలో అన్ని రాజకీయ పార్టీలలో నేతలు ఇదే చేస్తున్నారని సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కానీ ఎన్నికల సంఘానికి మాత్రమే తెలియకపోవడం ఆలోచింప వలసిన విషయమే. కనుక గొంగళి మీద కూర్చొని వెంట్రుకలు ఏరేందుకు ప్రయత్నించడం వృధాయే!