ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ మహబూబ్నగర్ చేరుకొన్నప్పుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బిజెపి సీనియర్ నేత జితేందర్ రెడ్డితో కలిసి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. ‘రాష్ట్రంలో ప్రజలందరూ మీ వెనుకే ఉన్నారని, వచ్చే ఎన్నికలలో కల్వకుంట్ల కుటుంబాన్ని మీరే ఓడించి గద్దె దింపగలరని’ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బండి సంజయ్తో అన్నారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. టిఆర్ఎస్ పార్టీని ఓడించే ఏ పార్టీతో నైనా కలిసి పనిచేయడానికి సిద్దమే అని అప్పుడే చెప్పారు. కానీ ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. ఇప్పుడు బండి సంజయ్ను కలిసి టిఆర్ఎస్ను మీ నేతృత్వంలో బిజెపి ఓడిస్తుందని చెప్పినందున కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్దపడుతున్నట్లున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.